రుసరుసలాడుతున్నట్టుగా... బుసబుస పొంగుతున్నట్టుగా...
కూతురు ఎదురు వచ్చి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది.
తమ్ముడి ఉత్తరం ఏమైనా వచ్చిందా అమ్మా... అన్నాడాయన కాళ్లు కడుక్కుంటూ.
అవున్నాన్నా.. అందా అమ్మాయి.
ఆయనకు తెలుసు ఇల్లు కోపంగా ఉండేది అప్పుడే. తమ్ముడి ఉత్తరం వచ్చినప్పుడు. అందులో ఏముంటుందో అందరికీ తెలుసు. ఆమాట కొస్తే దానిని ఎవరూ చింపి చదవరు కూడా. ఎందుకు చింపడం? డబ్బు కోసమే కదా ఆ ఉత్తరం.
ఊళ్లో ఉంటాడు తమ్ముడు. వ్యవసాయం చేస్తాడు. కడప జిల్లాలో ఏదో ఒక మూల కాసింత పొలం... కాసింత సేద్యం... కాసిన్ని గింజలు... కాని అవి నోటికి అందేదాకా ప్రతిసారీ తిప్పలే. వానలు పడవు. నీళ్లు అందవు.
విత్తనాలు కల్తీ. ఎరువులు కల్తీ. పురుగు మందులు కల్తీ. ఒక్కోసారి తట్టుకుంటాడు. ఒక్కోసారి- అన్నయ్యా... కష్టంగా ఉంది... కాసిన్ని డబ్బులు పంపు... అని ఉత్తరం రాస్తాడు.
ఆ ఉత్తరం వచ్చిందంటే ఇంట్లో కోపం. భార్యకు కోపం. ఇక్కడ ఏం ముల్లె ఉందని వేలకు వేలు పంపుతున్నావు నీ తమ్ముడికి అని జగడం. అందుకే తమ్ముడి ఉత్తరం వచ్చినప్పుడు ఆయన ఇంట్లో దానిని చింపడు. ఏమీ మాట్లాడడు. వివరాలు ఎత్తడు. తమ్ముణ్ణి గుండెలకు హత్తుకున్నట్టుగా ఆ ఉత్తరాన్ని గుండె మీద జేబులో పెట్టుకొని
తిరుగుతూ ఉంటాడు.
ఉపాధ్యాయుడు ఆయన. రెండ్రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. ఇద్దరు పిల్లలు. బాగా చదివించుకున్నాడు. అబ్బాయి హైద్రాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయికి పెళ్లి చేయాలి. రిటైర్ అయితే బెనిఫిట్స్ వస్తాయి. పెన్షన్ వస్తుంది. రైతుకు- తన తమ్ముడికి- ఏమొస్తుంది?
చిన్నప్పుడు తండ్రి దగ్గర రెండు ఎద్దులుండేవి. అవి రెండూ సమానంగా కష్టపడితే పంట పండేది. తండ్రి తననూ తమ్ముణ్ణి సమానంగా కష్టపడనివ్వలేదు. తనని చదివించాడు. తమ్ముణ్ణి సేద్యంలో పెట్టాడు. అప్పటి నుంచి తమ్ముడు ఒక్కడే కాడిని భుజాన మోస్తూ కష్టపడ్డాడు. తాను ఊరికి ఎప్పుడైనా వెళ్లి ఇంగ్లీషు పేపర్ చదువుతూ కనిపిస్తే తమ్ముడు గర్వంగా నలుగురికీ చూపించుకొని సంబర పడతాడు. తన పిల్లలు వస్తే వాళ్లను గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాడు. తాను బాగుంటే వాడు బాగున్నట్టు. కాని వాడు నిజంగా బాగున్నట్టా?
భార్య బీరువా తీసి పదివేలు ఎంచి ఎవరికో ఇవ్వడం కనిపించింది. తాను ఎల్లుండి రిటైర్ అవుతున్న సందర్భంగా పెద్ద ఫంక్షన్ చేయాలట. అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలట. ఎంత ఖర్చయినా పర్వాలేదట. తల్లీ కొడుకూ కలిసి ఏర్పాట్లు చూస్తున్నారు. వృధా ఖర్చు. ఆ డబ్బు తమ్ముడికి పంపితే వాడికి ఎంత అక్కరకొస్తుందో కదా!
ఆయన గుండె తమ్ముడూ తమ్ముడూ అని కొట్టుకుంటూ ఉంది. కొట్టుకున్న
ప్రతిసారీ ఆ చప్పుడు జేబులో ఉన్న ఉత్తరాన్ని తాకుతూ ఉంది.
అన్నానికి కూచున్నాడు. తినబుద్ధి కాలేదు. తినకపోతే భార్యకు కోపం వస్తుంది. తిన్నట్టు నటిస్తున్నాడు. తాను అన్నం పెట్టాల్సిన తల్లిదండ్రులు ఊళ్లోనే ఉన్నారు. వాళ్ల బాధ్యతను తానేమీ తీసుకోలేదు. తమ్ముడికే
వదిలిపెట్టాడు. తమ్ముడి ఎదన అదో బరువు. తను మాత్రం ఇక్కడే చక్కగా పెళ్లాం బిడ్డలతో.
తమ్ముడూ... తమ్ముడూ... ఆయన హృదయం మొత్తుకుంటోంది.
లేచి చేయి కడుక్కున్నాడు. వరండాలోకి వచ్చి పడక్కుర్చీలో కూచున్నాడు. భార్య ఏదో పని మీద పక్కింటికి వెళ్లింది. కాసేపటి వరకూ రాదు. ఆయన- కూతురిని పిలిచి- దగ్గర కూచోబెట్టుకుని జేబులో నుంచి ఉత్తరం తీసి- కాస్త చదివి పెట్టమ్మా అన్నాడు. కూతురు చదివింది-
అన్నయ్యా. నువ్వు రిటైర్ అవుతున్నావని విన్నాను. ఇంత కాలం నువ్వు కష్టపడ్డావు. ఇక మీదైనా నీకు కాసింత విశ్రాంతి దొరికితే నాకదే సంతోషం. పంటల సంగతి పొలాల సంగతి ఎప్పటిలాగే ఉంది. చేతిలో డబ్బు ఆడటం లేదు. నీటి కరువుతో మన చింతతోపు ఎండిపోయేలా ఉంది. ఇంకొన్నాళ్లు గడిస్తే నిలువెండిపోతుంది. అందుకే దానిని అమ్మేశాను. యాభై వేలు వచ్చాయి. త్వరలో నీ భాగం పాతిక వేలు తెచ్చిస్తాను. అన్నయ్యా... టీచరుకు
రిటైర్మెంటు ఉండొచ్చు. కాని రైతుకు రిటైర్మెంట్ ఉండదు. కడవరకూ చేనులో నడుం వంచి పని చేసే వాడే ధన్యుడు. కాని మన ప్రాంతంలోని సేద్యం మనల్ని బతకనివ్వదూ చావనివ్వదూ కదా. ఉంటాను. నీ తమ్ముడు.
కూతురు ఉత్తరం ముగించేటప్పటికి ఆయన కళ్లు తడిసి ఉన్నాయి. తమ్ముడి సంగతి ఆయనకు తెలుసు.
అక్కరలేకుండా పూచికపుల్ల కూడా అమ్మడు. అలాంటిది తరాలుగా తమకు అంది వచ్చిన చింతతోపు అమ్మేశాడంటే ఎంత కష్టం వచ్చిందో. ఎంత బాధలో ఉన్నాడో. ఇంత బాధలో కూడా తన వాటా తనకు తెచ్చిస్తాడట.
ఎందుకు నాన్నా... అంది కూతురు.
నీకు తెలియదమ్మా. అమ్మకు తెలిస్తే మన వాటా పాతికవేలు కాకుండా పాతబాకీల కింద వాడి చేతిలో ఉన్న మిగిలిన డబ్బు కూడా ఇమ్మంటుంది. వద్దు. నాకు తెలిసి నా భార్యాపిల్లలకు నేనేమీ తక్కువ చేయలేదు. ఏ ఒక్క లోటూ రానివ్వలేదు. కాని వాడు నా రక్తం పంచుకుపుట్టినవాడమ్మా. నా తోబుట్టువు. వాడికి కూడా నన్నేమైనా సాయం చేయనీయమ్మా...
కూతురు తండ్రినే చూస్తుండిపోయింది.
ఏ పేగు కదిలిందో చిన్నాన్న కష్టం ఏమర్థమయ్యిందో ఓదార్పుగా తండ్రి భుజం మీద చేయి వేసి ఉత్తరం చింపేసింది.
కథ ముగిసింది.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన అర్ర్దమైన కథ- తమ్ముడి ఉత్తరం- ఇది.
ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు మన కోసం నిలబడతారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు తమ రక్తాన్ని కరిగించి మనకు క్షీరం తాగిస్తారు. ఇవాళ మనం ఎదిగిపోయి ఉండొచ్చు. పైస్థాయిలో నిలుచుని ఉండొచ్చు. గతంలో మన కుటుంబ సభ్యులు మనకోసం పడిన కష్టాన్ని మర్చిపోయినట్టుగా నటిస్తుండొచ్చు. కాని- మన ఒంట్లో ఉన్న వాళ్ల కష్టం, మన ఒంట్లో ప్రవహిస్తున్న వాళ్ల రక్తం ఊరికే ఉండనిస్తుందా? స్థిమితంగా
కూచోనిస్తుందా?
మరి- మీ కోసం కష్టపడిన మీ అన్నయ్య, తమ్ముడు, మేనమామ, చిన్నాన్న... వాళ్ల కోసం మీరేం
చేయబోతున్నారు?
సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి: రాయలసీమ నుంచి స్థిరంగా నిలకడగా కథారచన సాగిస్తున్న మంచి కథకుడు. రైతుజీవితాన్ని, స్ర్తీల సంక్షోభాలని కథలుగా మలచి గురితప్పని బాణాల్లా సంధించారు. ‘కొత్తదుప్పటి’, ‘బతుకుసేద్యం’ వీరి కథాసంపుటాలు. ఐదు నవలలు రాశారు. స్వస్థలం కడపజిల్లా. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఫోన్: 9441287865.
శుక్రవారం :28/01/2011
సాక్షి ఫ్యామిలీ, ప్రతి రోజూ ఓ కథా పరిచయం నుండి...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి