
చెరువులో పాములు పడినట్టు గభీమన్నాడు సోమయాజులు. ఉదయం పూట, ప్రశాంతంగా చెరువులో దిగి, స్నానం చేస్తూ, మరి కాసేపటిలో మైల అంటకుండా భోజనం చేద్దామనుకుం
టున్నవాడల్లా ఈ ఉదంతానికి కట్టెపేడులా నీళ్లపైకి తేలాడు. కోపంతో నీలుక్కుపోయాడు. ఆవేశంతో రాగిబిందెలా మారి
గభీమని మళ్లీ పెద్ద పెద్ద కెరటాలు వచ్చేలాగా నీళ్లల్లో మునిగి
అడావిడిగా ఒడ్డుకి చేరాడు.
అతడికి సంభవించిన ఉపద్రవం ఏమిటి?
దూరంగా ఒక ఇరవై ముప్పయి మంది మాదిగ వనితలు గట్టు మీద బిందెలు, కడవలు పట్టుకొని నీళ్ల కోసం నిలుచుని ఉన్నారు. నీళ్లు కావాలన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. వాళ్లు
చెరువులో దిగితే ఇంకేమైనా ఉందా?
ఇంతకుముందే చెరువులో ఒక కమ్మ స్ర్తీ నీళ్లు ముంచుకుపోయింది. యాజులుకి అభ్యంతరం అనిపించలేదు. ఒక వైశ్యుడు వచ్చి కాళ్లు కడుక్కున్నాడు. అడ్డంకి చెప్పేదానికి ఏమీ లేదు. చాకళ్లు దూరంగా రేవులో దిగి మాసిన బట్టల మూటలు విప్పారు. ఇది మామూలే. ఒక సాయెబుగారైతే యాజులు పక్కనే నీళ్లలోకి దిగి, యాజులుతో సమానంగా థుస్కు థుస్కుమని నీళ్లు పుక్కిలించి ఊశాడు. నోరెత్తడానికి లేదు. ఇక ఇతర కులాల వాళ్లు ఎప్పుడైనా చెరువులోకి దిగవచ్చు, అవసరమైనన్ని నీళ్లు ముంచుకోవచ్చు. కాని, మరీచోద్యంగా మాదిగ వనితలు దిగడం అంటే....
ఇటువంటి అఘాయిత్యం ఇంతకుముందెన్నడైనా ఉందా!
మీ చెరువు ఏమైంది? అడిగాడు యాజులు.
కుష్టు వెంకడు పడి చచ్చిపోయాడండీ... అన్నారు మాదిగ
వనితలు.
ఊరికి ఉన్నది ఒకటే పెద్ద చెరువు. అది మాదిగలది తప్ప తక్కిన అందరిదీ. మాదిగలు ఆ పెద్ద చెరువుపై ఆధారపడిన చిన్న చెరువు నీళ్లు తాగుతారు. ఇప్పుడు ఆ చిన్న చెరువు పనికి రాకుండా పోయింది కనుక మాదిగ వనితలు వేరే గతి లేక, పెద్ద చెరువుకు వచ్చి, ఎవరైనా ముంచి పోస్తే పోయించుకోవడానికన్నట్టుగా గట్టు మీద నిలుచుని ఉన్నారు. వేరెవరైనా పోస్తారు సరే, రోజూ వాళ్ల గాలి సోకడం ఎంత పాపం. వారి ముఖం చూడాల్సి రావడం ఎంత ఖర్మం. దీనిని సహిస్తారా ఎవరైనా?
ఆ రాత్రే యాజులు, కరణం, ఇతర పెద్ద కులాల పెద్దలు పంచాయితీ పెట్టారు. మాదిగ పెద్దల్ని పిలిపించారు. ఏం
జరుగుతుందో చూద్దామని ఊళ్లో ఉన్న సాయెబులు కూడా వచ్చారు. మాదిగలకు సాయెబుల మద్దతు. దేముడు కటాక్షించిన చెరువుకు కులం హేమ్టీ మతం హేమ్టీ పంతులు గారూ అని ఊరి పెద్దల్ని నిలదీశారు సాయెబులు. కాని కులపెద్దలు ఒప్పుకోలేదు. చాలా ఉపాయాలు చేశారు. చాలా మార్గాలు చూపారు. చాలా ప్రత్యామ్నాయాలు సూచించారు. అన్నింటి అర్థం ఒకటే- మాదిగలు చెరువులో మాత్రం దిగకూడదు.
మాదిగ పెద్దలు మౌనంగా తల ఒంచారు. కాని మాదిగల్లో కొత్త తరం ఒకటి వచ్చింది. ఈ మధ్య ఆ తరం
ఎందుకనో అసంతృప్తిగా ఉంటోంది. కిరస్తానీ మతంలోకి మారితే తమ బతుకులు మారతాయని వారిలో కొందరు కిరస్తానీ మతం తీసుకున్నారు. ఫాదరీలు వారికి ఇంగ్లీషు నేర్పారు. క్రాఫులు చేయించారు. వెట్టి నుంచి విముక్తం చేసి ప్యాంటూ షర్టూ వేసుకొనే యోగ్యుల్ని చేసి చిన్న చిన్న ఉద్యోగులుగానైనా మార్చగలిగారు. కాని, చాల్లేదు. ఇక్కడ వేలాదిఏళ్లుగా పాతుకొని పోయిన వ్యవస్థ కిరస్తానీలుగా మారిన మాదిగలను స్వీకరించలేదు. మాదిగలు కిరస్తానీలుగా మారినా సరే, వాళ్లు అంటరానివాళ్లే!
అందుకే- మాదిగ యువకుడు- విస్సన్నకు- కోపం వచ్చింది. తమను గాలికీ నీటికీ నిప్పుకీ దూరం చేసిన వర్ణవ్యవస్థ మీద చాలా కోపం వచ్చింది. దీని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలా?
ఇస్లాంలోకి మారితే? ముస్లింగా మారిపోతే? అప్పుడు తాను మాదిగ కాకుండా పోతాడు. అంటరానివాడు కాకుండా పోతాడు. వర్ణవ్యవస్థ చట్రంలో లేకుండా పోతాడు. అప్పుడిక తాను
స్వేచ్ఛాజీవి. సర్వస్వతంత్రుడు. పెద్దచెరువులోకి దిగకుండా తనను ఎవ్వరూ ఆపలేరు.
వెంటనే విస్సన్న- భార్యతో సహా మతం మారాడు. ఇస్మాయిల్గా మారిపోయాడు. ఇప్పుడు అతడి మతంలో చావు దగ్గర- పెళ్లి దగ్గర- మసీదు
దగ్గర- నమాజు దగ్గర- ఉచ్ఛం నీచం అంటూ ఏమీ లేదు. తాకరానిదీ తాకకూడనిదీ అంటూ ఏమీ లేదు. అతడు ప్రతి ముస్లింతో సమానం. ప్రతి హిందువుతోనూ సమానమే.
ఇంతకు మించి ఏమి కావాలి?
ఇస్మాయిల్ పొందిన స్వేచ్ఛను చూశాక మాదిగలందరూ ఊరి పెద్దలపై పెద్దస్థాయిలో తిరుగుబాటు చేశారు. తమ అంటరానితనాన్ని శాశ్వతంగా పీడ విరగడ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు ఉదయం- అగ్రహారంలోని పెద్ద కులాల వాళ్లందరూ చెరువులో దిగి స్నానాలు చేస్తూ ఉండగా ఊళ్లోని సాయెబులందరూ కరల్రు చేతబూని మాదిగలకు మద్దతుగా గట్టు మీద నిలబడ్డారు.
మరోవైపు మాదిగలు నిలబడ్డారు. ఇరుపక్షాలు ముందే నిశ్చయించుకున్నట్టుగా సంకేతాలిచ్చుకున్నారు. అల్లా హో అక్బర్ నినాదం ఒక్కసారిగా పిక్కటిల్లింది. మాదిగలంతా ఏక్దమ్మున ముస్లింలుగా మారిపోయారు. తరతరాలుగా తమను పీడిస్తున్న వేధిస్తున్న హీనపరుస్తున్న కాలరాస్తున్న అంటరానితనం కోరల నుంచి విముక్తం చెందారు. ఆ వెంటనే, ఏమాత్రం ఆలస్యం
చేయకుండా, పాముల్లాగా కాదు, ప్రాణమున్న మనుషుల్లాగా చెరువులోకి దభీమని దూకారు. సంతోషంగా దూకారు. చెరువును కావలించుకుంటూ సంబరంగా దూకారు.

చెరువు- ఆ వేళ- అందరినీ
తడిపినట్టే వారినీ సమానంగా తడిపింది.
కథ ముగిసింది.
మహా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తి 1932లో రాసిన- ఇలాంటి తవ్వాయి వస్తే- కథ ఇది.
మతాలని ఎవరూ ఆక్షేపించరు.
మతాలని ఎవరూ తప్పు అని చెప్పరు.
కాని మతాన్ని అడ్డుపెట్టుకొని కొందరిని పెమైట్టులో కొందరిని కింది మెట్టులో ఉంచడాన్ని మాత్రం ప్రతి ప్రవక్తా వేలెత్తి చూపాడు. ప్రతి కళాకారుడు రాళ్లెత్తి కొట్టాడు. ప్రతి రచయితా తన అక్షరాలతో ఆ దుర్మార్గాన్ని ఖండఖండాలుగా ఖండించాడు.
వైదికమతం తనలోని లోపాల వల్ల తన శ్రేణులకే ఎలా దూరం అవుతున్నదో అన్న ఆవేదనను శ్రీపాద ఈ కథలో వ్యక్తపరుస్తారు. మనిషిని మనిషి నుంచి వేరు చేసే కులం వద్దని శక్తిమంతంగా చూపుతారు.
****************************************************************************
త్వరలో ఈ కథకు వందేళ్లు నిండుతాయి.
అయినా సరే- ఇంకా- దళితుడన్న కారణంగా బట్టలూదీయించిన వైనం, దళితులన్న కారణంగా ఇళ్లు తగలబెట్టిన వైనం, దళితుడన్న కారణంగా మంత్రగాడన్న నెపంపెట్టి పళ్లు రాలగొట్టిన వైనం- అనే వార్తలు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి.
ఎందరు శ్రీపాదలు వస్తే ఇది పోతుంది?
ఇంకా ఎన్నాళ్లు గడిస్తే ఈ తగదా ముగుస్తుంది?
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తి: తెలుగు కథకుల కులదైవం. తెలుగు కథకు గర్వకారణం. తెలుగు కథలో ధ్రువతార. తన వందలాది కథల ద్వారా వచనం ద్వారా తెలుగు భాషకూ నుడికారానికీ ఎనలేని సేవ చేశారు. పాఠకుల హృదయాల ప్రక్షాళనకు దోహదపడ్డారు. స్వస్థలం తూ.గో.జిల్లా. 1961లో మృతి చెందారు. వీరి రచనలన్నీ విశాలాంధ్రలో అందుబాటులో ఉన్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి