ఒకరోజు మల్లయ్య సత్రానికి వెళ్లి, ‘‘స్వామీ! తమరే నాకు న్యాయం చేయాలి’’ అని వేడుకున్నాడు.
‘‘ఏమిటి నీ సమస్య?’’ అని విశాలాక్షుడు అడిగాడు.
ఇద్దరి పొలాలు సరిహద్దులు కొలతలు వేయించాలనీ, పట్నం నుంచీ నిపుణులు రావాలనీ, అంతవరకు ఎవరూ పొలం సాగు చేయవద్దనీ నాగరాజు చెప్పాడు. భూషయ్య పెద్ద భూస్వామి. ఆ పొలం సాగు చేయకపోయినా దిగులు లేదు. కాని, నాకు ఆ నాలుగు ఎకరాలే ఆధారం. పంట లేక, నేను కూలీ పనులకు వెళ్తూ నానా ఇబ్బందులు పడుతున్నాను. తమరు గ్రామాధికారితో చెప్పి, నాకు న్యాయం చేయండి’’ అని తన గోడు వెళ్లబోసుకున్నాడు మల్లయ్య.
‘‘గ్రామాధికారి ఎందుకలా తీర్పు వాయిదా వేస్తున్నాడు?’’
‘‘నేను గత్యంతరం లేక నా పొలాన్ని కూడా భూషయ్యకు అమ్ముతానని తాత్సారం చేస్తున్నాడు స్వామీ’’
‘‘సరే మల్లయ్యా! ధర్మం నీ పక్షాన ఉంది. ఎప్పటికైనా నీకు న్యాయం జరుగుతుంది. అధైర్యపడకు’’
‘‘స్వామీ! తమరు ఎలాగైనా గ్రామాధికారి నాగరాజు మనసు మార్చి, నాకు న్యాయం జరిగేటట్లు చూడండి’’ అని వేడుకున్నాడు మల్లయ్య.
‘‘గ్రామాధికారి మనసు మార్చడానికి నాకేమీ మహిమలు లేవు. దేవుడే నిన్ను కాపాడతాడు’’ అన్నాడు విశాలాక్షుడు.
విశాలాక్షుడు కొల్లాపురం విడిచి, మరొక గ్రామానికి వెళ్లిపోతున్నాడని తెలిసి, గ్రామాధికారి నాగరాజు వీడ్కోలు చెప్పడానికి కుటుంబ సమేతంగా వచ్చాడు.
నాగరాజుని గమనించిన విశాలాక్షుడు, ‘‘నాగరాజూ! గ్రామాధికారివైన నీవు గ్రామస్తులను కన్నబిడ్డలుగా కాపాడాలి. అందరి క్షేమం చూడాలి. పక్షపాత బుద్ధి కూడదు’’ అన్నాడు.
నాగరాజు కలవరపడి, ‘‘స్వామీ! వీలైనంత వరకూ నేను న్యాయంగానే వ్యవహరిస్తాను’’ అన్నాడు.
‘‘మంచిది. నీకు ఆయువు దగ్గరకొచ్చింది. నెల రోజుల తర్వాత మరణిస్తావు. ఈ లోపల మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకో. స్వర్గ ప్రాప్తి లభిస్తుంది’’ అన్నాడు విశాలాక్షుడు.
నాగరాజు భయపడిపోయి, ఆ రోజు నుంచే మంచి పనులు చేయడం ఆరంభించాడు. అలాగే మల్లయ్య పొలం సరిహద్దులు సక్రమంగా ఉన్నాయనీ, ఇక నుంచి పొలం సాగుచేసుకోవచ్చనీ తీర్పు చెప్పాడు.
మల్లయ్య సంతోషించి యథాప్రకారం తన పొలం సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
గ్రామాధికారి నాగరాజు చాలా మంచి పనులు చేస్తూ గ్రామస్తుల మెప్పు పొందాడు.
మళ్లీ సంవత్సరం తర్వాత, విశాలాక్షుడు కొల్లాపురం వచ్చి సత్రంలో విడిది చేశాడు. అప్పుడు నాగరాజు కలుసుకుని తన సందేహం గురించి అడిగాడు.
‘‘స్వామీ! తమరు లోగడ వచ్చినప్పుడు నేను నెల రోజులే బతుకుతానని సెలవిచ్చారు. సంవత్సరం గడిచింది. నేను నిక్షేపంగా ఉన్నాను.’’
విశాలాక్షుడు నవ్వి, ‘‘నాగరాజు! అప్పటి పరిస్థితిని బట్టి అలా చెప్పాను. నువ్వు ఆ నెలలోనే పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించుకున్నావు. అందువల్ల నీ ఆయుష్షు పొడిగించబడి ఉంటుంది’’ అని వివరించాడు.
నాగరాజు సంతృప్తి చెంది, అప్పటి నుంచి న్యాయ మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజల మెప్పు పొందాడు.
- వాణిశ్రీ
05-12-10, సాక్షి, ఆదివారం అనుబంధం నుండి..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి