Pages

13, డిసెంబర్ 2010, సోమవారం

తిండిబోతుల తెలివి

సాక్షి, ఫండే, 12-12-2010 నుండి..
చంద్రగిరి, శివగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. ఒక పర్యాయం శివగిరి రాజ్యంలో క్షామం వచ్చింది. ప్రజలు తిండిలేక ఇబ్బందులు పడసాగారు.

చంద్రగిరి రాజు మహేంద్ర భూపతి, మానవతాదృక్పథంతో శివగిరి రాజ్యానికి సహాయం చేయాలని భావించాడు. కోశాగారం నుంచి కొంత మొత్తం తీసి, శివగిరి రాజ్యానికి పంపాలని నిర్ణయించాడు. ఆ బృహత్కార్యంలో తన ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయదలచి, రాజ్యంలోని ప్రజలందరూ ఒకపూట తిండి మాని, ఆ తిండి గింజలను శివగిరి రాజ్యానికి పంపాలని, అలా చేయనివారిని కఠినంగా శిక్షిస్తానని ప్రకటించాడు.

చంద్రగిరి రాజ్యంలో భీమరాజు, సింహరాజు అనే ఇద్దరు తిండిబోతులు ఉన్నారు. రాజు ప్రకటన విన్న వాళ్లిద్దరూ ఒక పూటంతా పస్తు ఉండటం తమ వల్ల కాదని భయపడిపోయారు. ఇద్దరూ ఒకచోట చేరి తీవ్రంగా ఆలోచించి ఒక పథకం వేశారు. దాన్ని అమలు చేసి పస్తు ఉండకుండా తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు.

రాజు ప్రకటించిన విధంగా చంద్రగిరి ప్రజలందరూ ఒకపూట పస్తు ఉండి, తిండి గింజలు శివగిరి రాజ్యానికి చేరవేశారు. అనంతరం మహేంద్ర భూపతి తన చాటింపును ఖాతరు చేయక, ఒకపూట పస్తు ఉండని ప్రజల జాబితా తయారుచేయమని వేగులను ఆదేశించాడు.

వారం తరువాత వేగులవారు మహారాజును కలిసి ‘‘రాజా! మీ చాటింపును ఖాతరు చేయక, పస్తు ఉండకుండా సుష్టుగా భోజనం చేసినవాళ్లు రాజ్యం మొత్తం మీద ఇద్దరే ఇద్దరు. వాళ్ల పేర్లు భీమరాజు, సింహరాజు’’ అని మనవి చేశారు.
మహేంద్ర భూపతి ఆగ్రహించి, వారిద్దరినీ తక్షణం తన ముందు హాజరుపరచమని ఆదేశించాడు. భటులు వారిద్దరినీ మహారాజు ముందు హాజరుపరిచారు.

‘‘నా ఉత్తర్వు ప్రకారం మీరిద్దరూ ఒకపూట పస్తు ఉన్నారా?’’ అని ప్రశ్నించాడు మహేంద్ర భూపతి.
‘‘క్షమించండి మహారాజా! మేం పస్తు ఉండలేదు’’ అని వాళ్లిద్దరూ బుద్ధిగా తప్పు ఒప్పుకున్నారు.
మహారాజు కొంచెం శాంతించి, ‘‘ఎందుకు అలా చేయలేదు’’ అని అడిగాడు.
‘‘మహారాజా! మీరు కుటుంబీకులను పస్తు ఉండమన్నారు గాని, అతిథులను పస్తు ఉంచమని చెప్పలేదు’’ అన్నారు తిండిబోతులు.

‘‘నిజమే! కానీ అది మీకు ఎలా వర్తిస్తుంది?’’ ఆశ్చర్యపోయాడు మహేంద్ర భూపతి.
‘‘మరేంలేదు మహారాజా! మేం గంట గంటకీ ఏదో ఒకటి తినకుండా ఉండలేం. అందుకే ఒకరింటికి మరొకరం అతిథులుగా వెళ్లాం. అప్పుడు మీ ఆదేశం వర్తించదని భావించి, కడుపునిండా భోజనం చేశాం. తప్పయితే క్షమించండి’’ అని చేతులు జోడించారు భీమరాజు, సింహరాజు.
వాళ్ల తెలివికి మహారాజు నవ్వుకుని, మందలించి పంపేశాడు.
- ఎన్.శివనాగేశ్వరరావు చందమామ స్టోరీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి