Pages

29, జనవరి 2011, శనివారం

శ్రమే దైవం

అనంత మహర్షి వద్ద సుందరుడు, గుణనిధి అనే ఇద్దరు శిష్యులుండేవారు. ఓనాడు మహర్షి వారిద్దరినీ పిలిచి, ‘‘ఈనాటితో నావద్ద మీ శిష్యరికం పూర్తి అయ్యింది. మీరు అన్ని పరీక్షల్లో ఉత్తమంగా నిలిచారు. కాని, జ్ఞానం కన్నా అనుభవం, ఆచరణ గొప్పవి. అవి మిమ్మల్నే కాదు, సమాజాన్నీ ప్రభావితం చేస్తాయి. అందుకే మీరిద్దరూ చుట్టుపక్కల ఉన్న ఏ గ్రామానికైనా వెళ్లి, ఆరు నెలలు నివసించి, తిరిగి ఆశ్రమానికి రండి. మీరు గ్రహించిన విషయాల్నిబట్టి, మీ శిక్షణ పూర్తి అయ్యిందో లేదో నిర్ణయిస్తాను’’ అన్నాడు.
గురువు ఆజ్ఞ ప్రకారం శిష్యులు బయలుదేరి వెళ్లారు.

సుందరుడు క్రిష్ణాపురం అనే గ్రామం చేరి, ఊరి మధ్యలో ఉన్న రావిచెట్టును నివాసంగా చేసుకుని, ప్రజల్ని తన ప్రవచనాలతో ప్రభావితం చేయసాగాడు. క్రమక్రమంగా అతని ఉపన్యాసాలకి ఆకర్షితులైన ప్రజలు ధ్యానమార్గంలో పయనిస్తూ, భక్తిభావాలు పెంపొందించుకుంటూ ఉన్నతంగా జీవించసాగారు.
గుణనిధి చేరిన చిత్రాపురం గ్రామంలోని ప్రజలు, వర్షాలు పడక, పంటలు పండక దారిద్య్రంతో బాధపడుతూ ఉన్నారు.

ఆ గ్రామస్తుల్లోని అనైక్యత కారణంగా ఒకరినొకరు నిందించుకుంటూ, అకారణంగా శత్రుత్వాలు పెంచుకుంటూ వైషమ్యాల్లో జీవించడం గుర్తించిన గుణనిధి, ముందుగా వారందరిలో ఐకమత్యాన్ని పెంపొందించటానికి కృషి చేశాడు.

ఆ ఊరి జమిందారును కలిసి, ఊరి మధ్యలో చెరువు తవ్వించడానికి ధనాన్ని ఇవ్వడానికి ఒప్పించాడు. ఓరోజు ప్రజల్ని సమావేశపరిచి, ‘‘మీరంతా ఒకే తాటిపై నిలిచి, సహకరిస్తే ఈ చెరువు నిర్మాణం పూర్తవుతుంది. అందరూ తలో చేయి వేసి, ఈ కార్యాన్ని పూర్తి చేస్తే, నీటి సమస్య పరిష్కారమవుతుంది’’ అన్నాడు.

ప్రజలంతా సరేనన్నారు. గుణనిధి నాయకత్వ స్ఫూర్తితో గ్రామస్థులందరూ కలిసి చెరువు తవ్వుకుని, నీటి ఎద్దడిని నివారించుకున్నారు.
ఆరు నెలల అనంతరం, శిష్యులిద్దరూ అనంతమహర్షిని కలిసి తమ అనుభవాలను వివరించాడు.
ఆయన ఆనందంతో ఉప్పొంగి పోయాడు.

‘‘సుందరుడు ప్రజల్ని ధర్మ మార్గంలో, గుణనిధి ప్రజల్ని శ్రమ మార్గంలో నడిపించారు. ఏ దేశానికైనా శ్రమ, ధర్మం రెండూ రెండు కళ్ల లాంటివి. అవి ఆచరించే ప్రజలు ఎప్పుడూ ఉన్నతంగా ఎదుగుతారు. నాయనలారా! ఈనాటితో మీ శిక్షణ పూర్తయ్యింది. ఇలాగే మానవాళికి ఉపయోగపడే విధంగా మీ మీ మార్గాల్లో పయనించండి’’ అంటూ శిష్యుల్ని ఆశీర్వదించారు.
- కె.వాసవదత్త రమణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి