..................................................................కె. అనురాధ
12-12-10, ఆంధ్రజ్యోతి, ఆదివారం అనుబంధం నుండి.. వంటింట్లో కుక్కర్ మోతల మధ్య సూపర్ స్పీడ్లో పనులు చేసుకుంటూనే సుజాత టి.విలో వచ్చే అన్నదాత కార్యక్రమంపై ఒక చెవి, ఒక కన్ను పారేసింది.
పేపర్ చదువుతూ "సుప్రభాతంలాగా పొద్దున్నే ఇదొకటి'' అని విసుక్కున్నాడు వాళ్లాయన. "ఇది చూసి ఏ రైతన్నా వ్యవసాయం నేర్చుకుంటాడని నువ్వు నమ్ముతావా?'' అని వెటకారం కూడా ఆడాడు.
సుజాత జవాబు చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. పనంతా అయ్యాక అందరికీ క్యారేజీలు సర్దిపెట్టి తను కూడా బయలుదేరింది. "ఈ రోజు చాలా ఫీల్డ్ విజిట్స్ వున్నాయి. వచ్చేసరికి లేటవుతుంది'' అని చెప్పి బయటపడింది.
ఉద్యానవన అధికారిగా సుజాత పదేళ్ల నుండి అదే ప్రాంతంలో పనిచేస్తూ వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను చాలా దగ్గరగా గమనిస్తోంది.
బస్సు నగర పరిసరాలు దాటగానే రోడ్డుకిరువైపులా ఫెన్సింగ్లు వేసిన పొలాలు దర్శనమిచ్చాయి. పచ్చని చీర చుట్టిన పడుచులా వుండే చేలకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చీడపట్టి ముళ్ల చీర కట్టినట్టుంది. ఇప్పుడవి చేలు కావు-లే అవుట్లు.
మంచుకొండ నారాయణమూర్తిగారి తోటలోకి సుజాత అడుగుపెట్టిందో లేదో "మేడాముగారూ ... ఎవసాయం అంటే బంగారం యాపారమా సెప్పండి'' అడిగాడు అప్పలరాజు. నారాయణమూర్తి సిటీలో చాలా పెద్ద నగల వ్యాపారి. వచ్చిన లాభాలతో ఆనందపురం దగ్గర ముప్పయి ఎకరాలు కొన్నాడు. అప్పలరాజుని తోట సంరక్షకుడిగా పెట్టుకున్నాడు.
"మీ ఓనరుగారికి అసలు ఆదాయమే రావడం లేదట. నన్ను వచ్చి చూడమన్నారు'' అన్నది సుజాత తోటను పరిశీలిస్తూ. "అమ్మా! కొబ్బరిసెట్టు సమత్సరంలో రెండొందల కాయిలు కాస్తాదని మీలాటోరు పుస్తకాల్లో రాసీనారట. మరివేమి కాయకండా ఉన్నాయని నన్ను దెబ్బలాడేత్తాన్రు''.
"నల్లి తెగులు ఎక్కువగా వుంది అప్పలరాజు''.
"అదే నానూ సెప్పినానమ్మా. ఊరంతా ఇదే తెగులున్నాది. మరి సూడక్కర్లేదని సెప్పినా ఇన్నారు కాదు''. మంచుకొండ నారాయణమూర్తి దృష్టిలో అప్పలరాజు ఒక సోమరిపోతు. జీతం తీసుకుని పని చేయకుండా పడుకుంటాడు. ఏ పంట పెట్టినా పుస్తకాల్లో చెప్పినట్టు దిగుబళ్లు రావట్లేదని గోల. అప్పలరాజు లాంటివారు కేవలం సోమరితనం, తెలివితక్కువతనం వల్ల భూములు పోగొట్టుకున్నారని అతని నమ్మకం.
అప్పలరాజు లాంటి వారిని చాలామందిని చూసిన సుజాతకు అసలతను భూమిని ఎలా పోగొట్టుకున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అదే అడిగింది.
"తాత తండ్రులిచ్చిన బూమి. నా కుటమానవంతా కష్టపడీవోల్లం. నాను పండించని పంటనేదు. నా సిన్నప్పుడు జొన్నలూ, చోళ్లూ, గంటెలూ పండీవి. తరువాత కాయగూరల పంట నేర్సినాక డబ్బులు బాగా వచ్చేయి'' అక్కడిదాకా చెప్పి ఏదో ఆలోచనలో పడ్డాడు అప్పలరాజు. మళ్లీ తనే "డబ్బంతా మాయేనమ్మా! అది మాలాటోరికాడ నిలవదు. ఇప్పుడిక ఆ బూదేవతా నిలవనేదు''. "ఎందుకమ్మావు నీ భూమిని?''
"ఎక్కడో గోదారిజిల్లా నుండి ఒచ్చినారు. మన బూమికి మంచి రేటుంటాదని మా కుర్రోల్లు గెంతినారు. ఆల్లకేటి తెలుసు బూమి ఇలువ. ఓరి నాయనా బూమి మనకు తిండెడతాదిరా. డబ్బెన్నాళ్లుంటాదని గోసబెట్టినా ఇన్లేదు. పంటలమీద ఏమొస్తంది? మన కష్టం తప్పేం మిగిలింది? డబ్బుంటే ఏదైనా యాపారం సేసుకోవచ్చు అన్నాడు మా పెద్దోడు'' అని కాసేపాగి "ఇప్పుడేటయ్యింది? అందరం కూలోల్లమైపోనాం. ఎటోల్లమటు పారొచ్చినాం''.
"నాకు తెలివినేదంటే ఒప్పుతాను. నిజివే మరి. తెలివుంటే బంగారంనాటి బూమినొగ్గుదునా? కాని నాకు రైతుపని తెల్దంటే మాతరం నానొప్పను'' ఖచ్చితంగా చెప్పాడు అప్పలరాజు.
తెలివిగల్ల వ్యవసాయం వ్యాపారమైంది. బ్రతుకుతెరువు కోసం చేసేది తెలివితక్కువ వ్యవసాయమైంది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల మధ్య ఊగిసలాడుతున్న దేశాన్ని తలుచుకుంటూ అప్పలరాజుకి నల్లి తెగులు నివారణకు మందు రాసిచ్చి మరో క్షేత్ర పరిశీలనకు వెళ్లింది సుజాత.
అది రిటైర్డ్ ఇంజనీర్ సోమేశ్వరరావుగారి అరటితోట. చాలా ఖరీదైన 'టిష్యూకల్చర్' అరటిమొక్కలతో ఇంటర్నెట్ వ్యవసాయం చేస్తున్నారాయన. ఆయనకి సహాయపడే మరొక 'సోమరిపోతు తెలివితక్కువ' రైతు దేముడు. ఎన్.. టి. పి.సి. థర్మల్ కేంద్రానికి తన భూమిని అప్పగించి నిర్వాసితుడయ్యాడు.
"దేవుడూ ఏమైంది మీ అరటితోటకి'' గబగబ అడిగింది సుజాత. అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, తను త్వరగా ముగించుకుని వెళ్లాలి.
"మీరంతా బాగా సదువుకున్నారు గావాల. ఏటైందో నానేటి సెప్పను'' అన్నాడు అదోలా.
"నాకైతే మొక్కలన్నీ బాగానే వున్నాయి. ప్రాబ్లెం యేమీ కనబడటం లేదు. మరి అయ్యగారు ఎందుకు కంగారు పడుతున్నారు?'' "ఏమోనమ్మా, అతగాడి లెక్కలు నాకేటీ బోదపడవు. ఒక సెట్టు ఆకు ఆరించీలు పెరిగినాదట. మరో సెట్టు ఆకు పదిహేను ఇంచీలు పెరిగినాదట. అలగుండకూడదు అదొకనాంటి తెగులని నా బుర్ర గొలికేత్తాండు''. సుజాత అతని వంక అయోమయంగా చూసింది.
"ఇంజనీరు బాబుగద ... కొలతలతో వెవసాయం సేత్తారు మరి'' అన్నాడు వెటకారంగా.
అప్పుడే కారులోంచి దిగుతూ సోమేశ్వరరావుగారు కనబడ్డారు. వస్తూనే -
"మేడమ్ తోట చూసారా?''
"చూసానండి. అంతా బాగానే వుందే''.
"యేం బావుందండీ? బ్రోచర్లో రాసినట్టుగా మొక్కలు ఎదగలేదు. ఇంతవరకూ పూత రాలేదు'' అన్నాడు సోమేశ్వరరావు. "మొక్కలమ్ముకోవడానికి వాళ్లు చాలా చాలా రాస్తారండి. అవన్నీ నిజం అనుకుంటే ఎలా?'' అసహనంగా అన్నది సుజాత. "బాగుంది. ఇలా అయితే రైతు ఎంత నష్టపోతాడు? అందుకే మన దేశం ఇలా ఏడ్చింది'' వాపోయాడు సోమేశ్వరరావు. చాలా అప్రయత్నంగా సుజాత చూపు దేముడిపై పడింది. నష్టపోతున్నదెవరో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఫోను మోగింది. డిస్ప్లేలో డా. ప్రభాకర్ అని చూడగానే సుజాత గుండె ఝల్లుమంది.
ఆయన పామాయిల్ తోట వేసింది మొదలు వారానికోసారి ఫోన్ చేసి ఎలకలొచ్చి మొక్కలను తవ్వుతున్నాయి అర్జంటుగా రమ్మనీ, లేకపోతే కాకులొచ్చి పళ్లుతిని పోతున్నాయి వచ్చి అడ్డం పడమనీ విసిగిస్తుంటాడు. చచ్చానురా దేముడా ... అనుకుంటూ సుజాత ఫోన్ ఎత్తింది.
"మొక్కలు నాటడానికి గోతులు తీయమన్నారు. అవి ఎలా తీయాలో మీరు కాస్త చెప్పాలి. అలాగే మొక్కజొన్న అంతరపంట వేయమన్నారు. అది ఎలా వేయాలో మా వాడికి కొంచెం చెప్పండి...'' ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతుంటే సుజాతకు చిర్రెత్తుకొచ్చింది. అప్పటికే ఇంజనీరుగారి లెక్కలతో విసుగ్గా వుందేమో "మీకు వ్యవసాయం నేర్పడం నా ఉద్యోగం కాదండి'' అంది విసురుగా. "అయినా మీ రైతుకు అన్నీ బాగానే తెలుసు. అతను చేస్తాడులేండి'' అంది.
"వాడి మొహం వాడికేం తెలుసు? వాడ్ని నమ్ముకుంటే అంతా నష్టమే'' అన్నాడు డా. ప్రభాకర్ వెంటనే. సుజాతకు సహనం పూర్తిగా నశించింది.
"మీ వైద్యవృత్తిలాగే వ్యవసాయం ఒక వృత్తి అని గుర్తించండి ప్రభాకర్ గారూ. మీరైతే పుస్తకాలు చదివి డాక్టరయ్యారుగాని రైతులు చిన్నప్పట్నించి తమ తాత తండ్రులను చూసి నేర్చుకున్న విద్య ఇది. వారి జ్ఞానాన్ని అపహాస్యం చేయకండి'' అని ఫోను పెట్టేసింది. సుజాత ఎజి. బి.ఎస్సీ చదివేటప్పుడు రైతులకు సరైన సలహాలు ఇచ్చి దేశానికి ఉపయోగపడాలని అనుకుందిగాని ఇలా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు చేసే వ్యవసాయ ప్రయోగాలకు, ప్రహసనాలకు తాను తోడ్పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు ఇంటికొచ్చాక కూడా సుజాత బుర్రనిండా అవే ఆలోచనలు. వ్యవసాయాన్ని ఒక జ్ఞానంగా ఎందుకు గుర్తించరు. ప్రతి ఒక్కళ్లకీ ఎంత చులకనైపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేషన్లు కూడా వ్యవసాయంలోకి దిగుతాయట. మన రైతుకున్న వ్యవసాయ జ్ఞానం జ్ఞానం కాదా? అది తరతరాలుగా సంతరించిన నైపుణ్యం కాదా? అది ఎంత అద్భుతమైన కళ. జాతీయ సంపద. రకరకాల ఆలోచనలతో సుజాత మనసు అల్లకల్లోలమైంది.
***
అన్ని సాయంత్రాలలానే పక్షులూ పశువులూ గూటికి చేరుకునే వేళ. కృష్ణంనాయుడు మాత్రం ఎందుకో ఇంకా తన కల్లం దగ్గరే వున్నాడు. అక్కడున్న పెద్ద చింతచెట్టు కింద కూర్చుని ఉన్నాడు. పశువులను ఇంకా విప్పలేదు. ఒక ఆవు, దాని పెయ్య రెండిటికీ మేతవేసి తన చేతులతో ప్రేమగా నిమిరాడు.
ఆ ఊరిలో ఎస్.ఈ.జెడ్ భూసేకరణ పనులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు నష్టపోతున్న భూముల్లో ఫలసాయాన్ని ఇచ్చే చెట్ల జాబితా రాయడానికి సుజాత వెంకటాపురం వచ్చింది. ఆ పెద్ద చింతచెట్టు కిందే కూర్చుని చెట్ల జాబితా రాస్తోంది. ఒక రైతు హడావిడిగా వచ్చి "అనాసపనాస రాయడం మర్సిపోనారు'' అన్నాడు. సుజాత తలెత్తకుండానే జవాబు చెప్పింది "అది రాయకూడదు. అది వార్షికపంట కదా. దానికేమీ నష్టపరిహారం ఇవ్వరు''.
పక్కనే కూర్చున్న కృష్ణంనాయుడు "అంటే మేడాముగారు నాకు తెలీకడుగుతాన్ను. మావేటి నష్టపోవాలో గూడా మీరే నిర్ణయించుకున్నారా? ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనీ పెబుత్వమే నిర్ణయిస్తది. మా నష్టాన్నీ నిర్ణయిస్తది, మాకిచ్చే సొమ్మునూ నిర్ణయిస్తది. ఆ తరువాత మావేటైపోవాలో మాతరం ఎవల్లూ సెప్పరు. ఆ ఊసెవల్ల కొద్దు. మా కర్మానికొగ్గీయండి'' అని ఆవేశంగా అన్నాడు. నాయుడు మాటల్లోని ఆవేదన - ఉద్వేగాన్ని అర్థం చేసుకుని సుజాత ఏదో చెప్పబోయింది. కాని అతను వినిపించుకునే స్థితిలో లేడు. "ఈ బూమ్మీద మావే బతికినామా? మాతోపాటు ఎన్నో జీవులు బతుకుతున్నాయి. ఈ సెట్టుందంటే ... దీని పండు నానొక్కణ్ణీ తింటన్నానా? దానిమీద ఎన్నో జాతులు పక్షులేటి, పురుగులేటి అన్నీ బతుకుతాయి. మీ ఇష్టమొచ్చింది రాసుకుని ... పోండి'' కోపంగా అన్నాడు.
పాలవలస కృష్ణంనాయుడు, తండ్రి అప్పలనాయుడు, గ్రామం వెంకటాపురం, మండలం అచ్యుతాపురం, ఎకరాన్నర చిన్నరైతు. తన రికార్డులో అదొక ఎంట్రీ మాత్రమే.
సుజాత కొక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది. అక్కడున్న చెట్లూ చేమలూ పశువులూ పంటచేలూ అన్నిటికీ నాయుడి బాధ అర్థం అయినట్లు కనబడింది, ప్రభుత్వానికి తప్ప. తనకు అర్థమైనా చేయగలిగిందేమీ లేదు.
*** సుజాత మనసు భారంగా ఉండి నిద్ర రావడం లేదు. గ్రామాలు ఇన్నాళ్ళలా లేవు. బ్రతకలేక బక్కచిక్కి పోతున్నాయి. తన చిన్నప్పటి పల్లెటూళ్లను గుర్తు చేసుకుంది. ఊరుకొక కళ ఉండేది. వ్యవసాయానికి ఒక గౌరవం ఉండేది. రైతుకు ఒక గుర్తింపు ఉండేది. ఇప్పుడు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. రైతులు వలస పోతున్నారు. వారి జాగాలోకి ఎవరెవరో వస్తున్నారు. గ్రామాలకేదో వెర్రి తెగులు సోకినట్లుగా అంతటా విషాదం కమ్మినట్లుంది. సుఖసంతోషాలు అలిగి పారిపోయాయి. రోడ్లు వెడల్పు చేసేటప్పుడు లాగిపారేసిన చెట్లలాగా మన ఆధునిక అవసరాలు రైతులను వేళ్లతో సహా పెళ్లగించి పారేస్తున్నాయి.
ఇంట్లో అందరూ నిద్రపోతున్నా సుజాతకు నిద్రపట్టడం లేదు. రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఉన్నట్టుండి ఈ గాలిదుమారమేమిటి? అన్నీ పడిపోతున్నాయి. తనింకా చింతచెట్టు కిందే వుంది ... అయ్యో అన్నీ ఎగిరిపోతున్నాయి. తన కాగితాలు ... వాటిని గట్టిగా పట్టుకుని నిలబడింది. అందరూ కొట్టుకుపోతున్నారేంటి? తను మాత్రం కదలకుండా ఉంది. కృష్ణంనాయుడు, అప్పలరాజు, దేముడు, అయ్యో! ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి వర్షం కూడా మొదలైంది. అంతా చీకటి ... ఏమీ కనబడటం లేదు. అందరూ మాయమైపోయారు. సుజాతకి బాగా భయం వేసింది. గట్టిగా కేకలేయడం మొదలుబెట్టింది.
"అమ్మా, అమ్మా లే'' ఎవరో తనని గట్టిగా తడుతూ లేపారు.
మంచం పక్కన ఆమె కూతురు కనబడింది. ఇదంతా కలేనా అని ఊపిరి పీల్చుకుంది.
"ఏమైందమ్మా ఎందుకలా అరిచావు?'' అనడిగింది పాప.
"భయం వేసిందిరా, రైతులంతా మాయమైపోయారు'' అని చెప్పింది సుజాత.
"అయితే ఏమవుతుంది?''
"వాళ్లు లేకపోతే మనకు అన్నం ఎలా వస్తుంది?''
"అన్నం లేకపోతే నూడుల్స్ తిందాం'' అని ఎగురుకుంటూ పోయింది.
ఆ రోజు ఎంతో దూరంలో లేదని నిట్టూరుస్తూ లేచింది సుజాత.
...............................................
రచయిత్రి సెల్: 94912 33002